దుబాయ్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెళ్లారు. దుబాయ్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన బన్నీ నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని పొందారు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన రాత్రి 8 గంటలకి జరగనుంది. ఇప్పటికే లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం విశేషం. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే కావడం మరో విశేషం. ఈ మ్యూజియంలో సినిమా, క్రీడలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు పొందుపరిచారు. సింగపూర్, లండన్, దుబారు.. ఇలా వివిధ చోట్ల ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలున్నాయి. దుబాయ్ లోని మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్, ఐశ్వర్య రారు, రణ్బీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చేరనున్నారు.