పోలవరం (అమరావతి) : పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సిఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని చంద్రబాబు వివరించారు. పోలవరాన్ని చూస్తే తన కళ్లవెంట నీళ్లచ్చాయన్నారు. రాష్ట్రాభివఅద్ధికి పోలవరమే జీవనాడి అని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలూ తీసుకుంటామన్నారు. ప్రజలు గెలవాలని.. రాష్ట్రం నిలబడాలని అన్నారు. అందుకే, ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలని అన్నారు. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వెబ్ సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు తెలిపారు. పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం ఇస్తామన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/chandrababu-04-1.jpg)