నేటి నుంచే హోం ఓటింగ్‌ ప్రక్రియ

May 2,2024 13:02 #home voting, #process

తూర్పుగోదావరి: ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టి నుండి హోం ఓటింగ్‌ ప్రక్రియను అధికారులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు హోమ్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. హోం ఓటింగు కోసం క్షేత్ర స్థాయిలో బఅందాల పర్యటిస్తున్నాయి. జిల్లాలోని 7 నియోజక వర్గాలలో హోం ఓటింగు కోసం 69 బఅందాలు, 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు ఇంటికే వెళ్లి అధికారులు ఓట్లు వేయిస్తున్నారు. అంగీకారం తెలిపిన 85 వయస్సు పైబడిన ఓటర్లు 648, పీడబ్ల్యూడీ ఓటర్లు 658 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే, ఎన్నికల కమిషన్‌ నూతనంగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్‌ ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని అధికారులు, సిబ్బంది అంటున్నారు.
ఇక, జిల్లాలో అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు ఇంటికి అధికారులు వెళ్లి ఓట్లు వేయిస్తున్నారని.. ఈ ప్రక్రియలో 400 మంది ఎన్నికలు సిబ్బందిని 69 బృందాలుగా ఏర్పాటు చేసి హోం ఓటింగ్‌ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జిల్లా కలెక్టర్‌ మాధవిలత తెలిపారు. హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. హోమ్‌ ఓటింగ్‌ కు అంగీకారం పత్రం సమర్పించిన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. హోం ఓటింగ్‌కు ఎన్టీఆర్‌ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసారు.. 25వేల మంది వృద్ధులు, మంచంపై ఉండిపోయిన వారిలో 1047 మంది హోం ఓటింగ్‌ విధానాన్ని వినియోగించుకోనున్నారు.. ప్రతీ నియోజకవర్గానికి 4 టీంలు ఉంటాయని, ప్రతీ టీం హోం ఓటింగ్‌కు వెళ్ళి ప్రత్యేక ఏర్పాటు చేసి, చాలా గోప్యంగా ఓటు వేయిస్తారని ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ అన్నారు. ఓటర్లలో అవగాహన వచ్చిందని, ముసలి వాళ్ళు సైతం పోలింగ్‌ కేంద్రానికి వస్తామని రాతపూర్వకంగా ఇచ్చారని వివరించారు.

➡️