నిర్మల్ : పేదల హక్కులను హరించి, కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివారం నిర్మల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి గ్రాడ్యుయేట్కు ఉద్యోగం ఇస్తామని అన్నారు. గిరిజనుల భూసమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని, కులగణన, ఆర్థిక సర్వే చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రజల పక్షాన నిలుస్తోందని అన్నారు.
కాంగ్రెస్ హామీల్లో ఐదు అమలు చేశాం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని, ఆగస్టు 15 లోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ఆదిలాబాద్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదని అన్నారు.