ఖాట్మండు : నాణ్యతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ బ్రాండ్లు తయారుచేస్తున్న సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు కొన్నింటి దిగుమతులు, విక్రయాలను నేపాల్ నిషేధించింది. సింగపూర్, హాంకాంగ్ల తర్వాత వీటిని నిషేధించిన మూడో దేశం నేపాల్. ఎండిహెచ్, ఎవరెస్ట్ తయారుచేసే నాలుగు రకాల ఉత్పత్తులను శుక్రవారం నుండి నిషేధించారు. వాటిల్లో ఎథిలిన్ ఆక్సైడ్ వుందని అనుమానిస్తున్నారు. ఈమేరకు నేపాల్ ఆహార నాణ్యత నియంత్రణా విభాగం ఒక ప్రకటన జారీ చేసింది. మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మిక్స్డ్ మసాలా పౌడర్, ఎండిహెచ్కి చెందిన మిక్స్డ్ మసాలా కర్రీ పౌడర్, ఎవరెస్ట్కి చెందిన ఫిష్ కర్రీ మసాలాలు నేపాల్లో నిషేధానికి గురయ్యాయి. తక్షణమే మార్కెట్లో నుండి ఆ ఉత్పత్తులను వెనక్కి తెప్పించాల్సిందిగా నేపాల్ ఆహార నాణ్యతా విభాగం వ్యాపారస్తులను, దిగుమతిదారులను కోరింది.