తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

May 26,2024 11:50 #rising temperatures, #Telangana

తెలంగాణ : రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా శనివారం నమోదైంది. నిర్మల్‌ జిల్లా కుభీర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 44.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 44.7 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా వ్యాల్‌పూర్‌లో 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 44.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, నల్గండ, మహబూబ్‌నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకఅతమైన వాయుగుండం శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పశ్చిమ, వాయువ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని ఫలోడిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఈ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. జూన్‌ 1, 2019న రాజస్థాన్‌లోని చురులో 50.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లోని ఫలోడిలో శనివారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది.

➡️