తెలంగాణ : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. ఈ వివరాలను ఆసుపత్రి ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె అంకితభావం, నాయకత్వం, నైపుణ్యం, రోగుల సంరక్షణపై నిబద్ధత తమకు ఎంతో దోహదపడతాయని ఐడీఎస్ఏ అధ్యక్షుడు స్టీవెన్ కె స్మిత్ తెలిపారు. ఈ ఫెలోషిప్ను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని సునీత పేర్కొన్నారు. మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతున్న అంటువ్యాధులను ఎదుర్కోవడం, రోగుల ఆరోగ్య సంరక్షణ విషయంలో తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. సునీతకు ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి తెలిపారు. అంటువ్యాధుల నివారణ, చికిత్సలపై ఆమె చేసిన అలుపెరగని పోరాటం తమ ఆసుపత్రులకు గర్వకారణమని ఆసుపత్రి ప్రతినిధులు ప్రశంసించారు.