పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తత

Mar 23,2024 05:30 #Jeevana Stories

ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో పిల్లల సంరక్షణ చాలా ముఖ్యం. సెలవుల్లో ఆటలు, పాటలు అంటూ పిల్లలు ఎక్కువ సేపు బయటే తిరుగుతూ ఉంటారు. తిండీ, నిద్రనూ నిర్లక్ష్యం చేసి ఆటల్లో మునిగిపోతారు. త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందుకే వేసవిలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
ఎండ తక్కువ ఉన్న సమయాల్లో అంటే ఉదయం, సాయంత్రం వేళ పర్వాలేదు గానీ, మధ్యహ్న సమయంలో అసలు బయటకు పంపవద్దు. ఆ సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది, రేడియేషన్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. మధ్యహ్న సమయంలో పిల్లలకి కథలు చెప్తూ, పుస్తకాలు చదివిస్తూ, బమ్మలు వేయిస్తూ, ఇంట్లో ఆడుకునేలా చూడాలి.
బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం వల్ల పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరిగి.. చెమట ఎక్కువగా పడుతుంది. ఒంట్లో నీరు వేగంగా ఆవిరై.. డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఈ పరిస్థితులు వడదెబ్బకు దారితీస్తాయి.
పండ్లు ఇవ్వాలి
వేసవిలో పిల్లల చర్మం పొడిబారి, దురద, మంట వంటి పలురకాల ఎలర్జీలు మొదలైతే వారు డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. యూరిన్‌కు అతి తక్కువగా వెళ్లడం, కడుపునొప్పి, తలనొప్పి, వికారంగా ఉన్నా గమనించాలి. మామిడి, ద్రాక్ష, పైనాపిల్‌, పుచ్చ, కమలా జ్యూస్‌లు పట్టించాలి. రోజూ ఉదయం గ్లాసు కొబ్బరినీళ్లు ఇవ్వాలి. ఇందులోని పొటాషియం వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. పిల్లలతో రోజుకి కనీసం రెండు లీటర్ల నీటిని తాగించడం అన్నింటికన్నా ముఖ్యం. సబ్జా నీళ్లు ఇచ్చినా మంచిది.
ఫ్రిజ్‌లోవి వద్దు
వేసవిలో వండిన పదార్థాలు త్వరాగా చెడిపోతాయి. దీంతో చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తింటుంటారు. ఈ పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పిల్లలకు ఇవి పెట్టకూడదు. పిల్లల్లో వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు ఫ్రిజ్‌ నీళ్లు తాగితే జలుబు చేసే అవకాశం ఉంది. కాబట్టి కుండ నీళ్లు ఇవ్వడం చాలా మంచిది.
గాలి తగిలేలా …
బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చిన్నారులకు తేలికైన, కాటన్‌ వస్త్రాలను వేయాలి. ఇవి సింథటిక్‌, ఇతర ఫ్యాబ్రిక్స్‌ కంటే చెమటను ఎక్కువగా పీల్చుకుంటాయి. అలాగే లేత రంగు దుస్తులను వేయాలి. ఇంట్లో వీలైనంత చల్ల గాలి వచ్చేలా చూడాలి. అధిక వేడి వల్ల ఉక్కపోత, చెమటతో పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. కాబట్టి ఎక్కువ గాలి తగిలేలా చూడాలి. రెండు పూటలా స్నానం చేయించాలి. బయట ఆటలాడి ఎక్కువగా చెమట పడుతుంది. నిర్లక్ష్యంగా వదిలేస్తే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
మజ్జిగ తాగించాలి
మధ్యాహ్నం భోజనం తర్వాత పలుచని మజ్జిగలో చిటికెడు జీలకర్రపొడి, ఉప్పు, పావుచెక్క నిమ్మరసం కలిపి తాగిస్తే జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. మజ్జిగలో కాల్షియం, విటమిన్‌ బి12, పొటాషియం అందుతాయి. ఇవి తలనొప్పి, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. క్యారెట్‌, కీరదోస ముక్కలపై కాస్త నిమ్మ రసం, చిటికెడు ఉప్పు చల్లి తినిపించడం చాలా మంచిది.
మసాలాలు వద్దు
వేసవిలో కారం, మసాలా, వేపుళ్లు, స్వీట్లు వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. పిజ్జా, బర్గర్‌, నిల్వ ఆహారాన్ని ఇవ్వకూడదు. ఇవన్నీ దాహాన్ని మరింత పెంచుతాయి. ఎక్కువగా ఇంట్లో తాజాగా వండిన ఆహారాన్నే తీసుకునేలా చూడాలి.
కూలింగ్‌ గ్లాసెస్‌
అత్యవసర పరిస్థితుల్లో పిల్లలు ఎండలో బయటకు రావాల్సి వస్తే తప్పనిసరిగా కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకునేలా చూడాలి. కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటే సూర్యుని కిరణాలు డైరెక్ట్‌గా కళ్లల్లో పడవు, కళ్లు సేఫ్‌గా ఉంటాయి. క్యాప్‌ పెట్టుకుంటే ఎండ డైరెక్ట్‌గా వారి తల మీద పడదు. ఎండ తలమీద పడితే తలనొప్పి, విసుగు, కళ్లు తిరిగే అవకాశం ఉంటుంది. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చల్లటి నీళ్లోతో కళ్లు శుభ్రంగా కడిగితే వారికి ప్రశాంతంగా ఉంటుంది.
సన్‌స్క్రీన్‌
పిల్లలు బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ తగిలే భాగాలకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయడం మంచిది. సన్‌స్క్రీన్‌ పిల్లలను సన్‌బర్న్‌ నుంచి రక్షిస్తుంది. పిల్లలు బయట ఉండే సమయం బట్టి సన్‌స్క్రీన్‌ రెండు సార్లు రాసినా పర్వాలేదు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు సన్‌స్క్రీన్‌ తొలగిపోతుంది.

➡️