బాలి(ఇండోనేషియా): ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఎసిసి) అధ్యక్షుడిగా జై షా తిరిగి ఎన్నికయ్యాడు. బాలీలో జరిగిన వార్షిక సమావేశంలో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా జై షా పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో జై షా వరుసగా మూడోసారి ఎసిసి అధ్యక్షునిగా కొనసాగనున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తర్వాత జై షా 2021 జనవరిలో మొదటిసారిగా ఈ పదవికి ఎన్నికయ్యారు. ”నాపై నమ్మకముంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన ఏసీసీ బోర్డు సభ్యులకు ధన్యవాదాలు. ఆసియా అంతటా క్రికెట్ను విస్తరించేందుకు ఎసిసి పాటుపడుతుంది. ఆట ఎక్కువగా అభివృద్ధి చెందని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం” అని జై షా అన్నారు. జైషా నాయకత్వంలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంకల్లో నూతన ప్రతిభావంతులను వెలికితీశామని షమ్మీ సిల్వా వివరించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/jai-shah.jpg)