విశాఖ : విశాఖపట్నంలో మరోసారి ఐపిఎల్ సందడి చేయనుంది. అయిదేళ్ల విరామం తర్వాత ఇక్కడి వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తిరిగి ఐపిఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఆదివారం రాత్రి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్లో రెండు మ్యాచ్ల కోసం విశాఖను ఢిల్లీ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. మరో మ్యాచ్ బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.
2012, 2015, 2016, 2019 సీజన్లలో విశాఖలో ఐపిఎల్ మ్యాచ్లు జరిగాయి. చివరి మ్యాచ్ కూడా ఢిల్లీ, చెన్నై (2019లో రెండో క్వాలిఫయర్) మధ్యే జరగడం విశేషం. ఇప్పుడీ రెండు జట్ల పోరులో సీఎస్కేనే ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు గెలవగా.. ఢిల్లీ రెండింట్లోనూ ఓడింది. పైగా సీఎస్కేతో ఆడిన గత నాలుగు ఐపిఎల్ మ్యాచ్ల్లోనూ ఢిల్లీ ఓటమిని చవిచూసింది. చెన్నై అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో శివమ్ దూబె, రచిన్ రవీంద్ర నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్లో ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ సత్తా చాటుతున్నారు. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణగా ఉన్న ధోని కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తే అవకాశముంది. మరోవైపు వరుస పరాజయాల నుంచి పుంజుకోవాలని ఢిల్లీ ఎదురు చూస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలో దిగిన పంత్ ఇంకా లయ అందుకోలేదు. ఆ జట్టులో ఆంధ్ర రంజీ కెప్టెన్ రికీ భురు ఉన్నారు. కానీ పఅథ్వీ షాను ఆడించాలనుకుంటే అతను పెవిలియన్కు పరిమితం కావొచ్చు.