వైసిపి పాలనలో దళితులే బాధితులు : ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌

Apr 7,2024 00:44 ##tdp #Addanki

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్
కొణిదెన గ్రామంలోని ఎస్‌సి కాలనీ, గంగపాలెం నందు ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి టిడిపి సూపర్ సిక్స్ పధకాలను వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. వైసిపి పాలనలో ఎస్సీలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయని అన్నారు. ప్రశ్నించడమే పాపమన్నట్లు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎస్‌సిలపై దాడి చేసి ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న విచిత్ర పరిస్థితులు చూశామని గుర్తు చేశారు. కాపులకు ప్రాధాన్యత ఇచ్చి కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కేంద్రం ప్రతిపాదించిన ఇడబ్ల్యుఎస్‌ ద్వారా 5శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రూ.4426 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వైసిపి ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. టిడిపి హయాంలో రూ.కోట్ల నిధులు ఎస్‌సిలకు రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు చూపిందని అన్నారు. పత్తేపురం, ఏల్చూరు, పి గుడిపాడు, జె పంగులూరు గ్రామాల్లో కాపు భవన నిర్మాణాలకు రూ.2కోట్ల నిధులు మంజూరు చేశామని అన్నారు. విదేశీ విద్యకు టీడీపి ప్రభుత్వంలో రూ.15లక్షలు అందించి ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందించామని అన్నారు. పేదల సంక్షేమం టిడిపితోనే సాధ్యమని అన్నారు. కార్పొరేషన్లన్నింటినీ వైసిపి ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

➡️