టోక్యో : సోమవారం ప్రపంచమంతా న్యూఇయర్ వేడుకలు జరుగుతుంటే.. ఒక్క జపాన్లో మాత్రం విషాదం చోటుచేసుకుంది. కొత్త ఏడాది ప్రారంభం రోజునే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలోనే తీవ్రస్థాయిలో భూప్రకంపనలు సంభవించడంతో వేలాది ఇళ్లు, ప్రధాన రహదారుల ధ్వంసమయ్యాయి. ఇక ఈ భూకంపం వల్ల 48 మంది మృతి చెందారని స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
కాగా, విపత్తు అధికారులతో సమావేశం అనంతరం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. ‘భూకంపం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో భవనాలు కూలిపోయాయి. విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశాము. విపత్తు బాధితులను రక్షించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము.’ అని ఆయన అన్నారు. ఇక ఈ భూకంపం వల్ల వాజిమాలో ఏడు అంతస్తుల భవనం కూలిపోయినట్లు ఏరియల్ న్యూస్ ఫుటేజ్ చూపించింది. సహాయక చర్యలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయని వాజిమా అగ్నిమాపక అధికారి తెలిపారు.