చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషికి క్షమాభిక్ష – దేశాధ్యక్షురాలు రాజీనామా..!

హంగరీ : చిన్నారిపై లైంగిక దాడి కేసుకు సంబంధించి దోషికి హంగరీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది.

కొంతకాలం క్రితం ఓ బాలల సంరక్షణాలయ ప్రధాన అధికారి అక్కడి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అధికారికి సహకరించిన మరో ఉద్యోగికి ప్రభుత్వ సూచన మేరకు ఆ దేశ అధ్యక్షురాలు కటాలిన్‌ నోవాక్‌ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇటీవలే ఓ వెబ్‌ సైట్‌ ఈ విషయాన్ని బయటపెట్టడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే ప్రధాని రాజీనామా చేయాలంటూ … ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గత శుక్రవారం నిరసనకారులంతా కలిసి ప్రెసిడెంట్‌ నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రధానితో పాటూ అధికార పక్షం మొత్తం ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

వరల్డ్‌ పోలో ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా … హంగరీ మ్యాచ్‌ను చూడటానికి దేశాధ్యక్షురాలు ఖతర్‌కు వెళ్లారు. దేశంలో ఉద్రిక్త పరిస్థితులు, నిరసనల గురించి తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

దేశాధ్యక్షురాలు కటాలిన్‌ నోవాక్‌ రాజీనామా..!

ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో శనివారం దేశ అధ్యక్షురాలు కటాలిన్‌ నోవాక్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజలను నొప్పించాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు. హంగరీ ప్రభుత్వాధికారం ప్రధాని చేతుల్లో ఉంటుందని తెలిపారు. అధ్యక్షులకు నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. తన నిర్ణయంతో బాధపడినవారందికీ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మార్చి 2022లో కటాలిన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఓ మహిళకు ఈ బాధ్యతలు దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ప్రధాని విక్టర్‌ ఆస్బార్న్‌కు ప్రధాన మద్దతుదారుగా ఉన్న కటాలిన్‌ రాజీనామా చేయడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. అయితే … ప్రధాని కూడా గద్దెదిగాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి.

➡️