ఢాకా : ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న 42 మందితో పాటు 75 మందిని రక్షించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఢాకా బెయిలీ రోడ్డులోని ఏడంతస్తుల రెస్టారంట్లో గురువారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగం అధికారి మహమ్మద్ షిహబ్ వెల్లడించారు. మంటలు క్రమంగా పై అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం కొంత కష్టతరమైందని అన్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ఈ మంటలు చెలరేగినట్లు అంచనా వేశారు. కొందరు పై నుంచి దూకటంతో తీవ్ర గాయాలయ్యాయని, మరణాలు పెరిగినట్లు రెస్టారంట్ మేనేజర్ సోహెల్ తెలిపారు.