పనికోసం రష్యా-ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్ళొద్దు : నేపాల్‌ సర్కార్‌

నేపాల్‌ : తమ ప్రజలు పని కోసం రష్యా-ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్లడాన్ని నేపాల్‌ సర్కార్‌ నిషేధించింది. ఇప్పటికే నేపాలీ ప్రజలు రష్యా తరపున సైన్యంలో చేరి పోరాడుతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు… కొందరు నేపాలీ ప్రజలు కూడా కిరాయి సైనికులుగా ఉక్రెయిన్‌ తరపున పోరాడుతున్నారని కొన్ని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే … ఉద్యోగాల కోసం నేపాల్‌ నుండి వెళుతున్న చాలామందిని రష్యా ఆర్మీలో చేర్చుకుందని, రష్యా సైన్యం తరపున వారంతా పోరాడారనీ నేపాల్‌ ప్రభుత్వం ఆరోపించింది. నేపాలీ మూలానికి చెందిన చాలామంది మరణించినట్లు నేపాలీ ప్రభుత్వానికి సమాచారం రావడంతో నేపాల్‌ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు విధించింది. యుద్ధం జరుగుతున్న ఏ దేశానికి నేపాల్‌ పౌరులు వెళ్లద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. నేపాల్‌ నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు పని కోసం రష్యా- ఉక్రెయిన్‌ దేశాలకు వెళుతున్నారు.. ఇందుకోసం వీరంతా నేపాల్‌ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

యుద్ధంలో కనీసం 10 మంది నేపాలీ ప్రజలు మరణించినట్లు పలు నివేదికలు….

దాదాపు నలుగురు నేపాలీయులను ఉక్రెయిన్‌ సైన్యం పట్టుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. యుద్ధంలో కనీసం 10 మంది నేపాలీ ప్రజలు మరణించినట్లు పలు నివేదికలు వెల్లడయ్యాయి. అయితే, ఇప్పటి వరకు యుద్ధంలో పాల్గనవారి సంఖ్య తెలియరాలేదు.. వారు ఉక్రెయిన్‌ సైన్యంతో ఎలా పరిచయం చేసుకున్నారు.. వారి ప్రస్తుత పరిస్థితి, వారు సజీవంగా ఉన్నారా లేదా అనే వివరాలు ఇంకా తెలియలేదు అని నేపాల్‌ సర్కార్‌ పేర్కొంది. నేపాల్‌ పౌరులకు సంబంధించిన వివరాలపై రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో యుద్ధం జరుగుతున్న ఏ దేశానికి నేపాల్‌ పౌరులు వెళ్లద్దని నేపాల్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

➡️