ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికలు
జకార్తా :ఇండోనేషియాలో బుధవారం అధ్యక్ష, ఉపాధ్యక్ష, పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రతినిధుల సభ, సెనెట్, ప్రావిన్షియల్, సిటీ, రీజెన్సీ స్థాయిలో స్థానిక లెజిస్లేటివ్ సంస్థల సభ్యులున్నారు. 1998లో నియంతృత్వ పాలన ముగిసిన తర్వాత జరుగుతున్న ఐదవ ఎన్నికలు ఇవి. ప్రపంచంలోనే మూడువ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాలో మొత్తంగా ఎన్నికలు జరిగే 20,600 పదవులకు గానూ దాదాపు 2,59,000మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. భారీ వర్షాలు, వరదలతో పోలింగ్కు అంతరాయాలు ఏర్పడ్డాయి. అయినా ఓటర్లు అత్యుత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. సుమారు 20 కోట్ల మంది ఓటర్లు దేశంలోఉన్నారు. కాగా, అధ్యక్షుడు జోకో విడొడొ వారసుడిగా ఎవరు వస్తారనే అంశంపైనే అందరి దృష్టి వుంది. ఎన్నికల ఫలితాల్లో రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో తన ప్రత్యర్ధుల కన్నా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. తానే విజయం సాధించినట్లు ఆయన చెప్పుకుంటున్నా ప్రత్యర్ధులు ఇరువురు మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. అధికారికంగా ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలంటున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఇండోనేషియా పోలింగ్ ప్రక్రియలో ఓట్ల ఫలితాలు అధికారికంగా రావడానికి అనేక వారాలు పడుతుంది.