న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితికి చెందిన కీలకమైన సంస్థలకు భారత్ ఎన్నికైంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణా బోర్డు (ఐఎన్సిబి) కు భారత్ నామినీ జగ్జిత్ పవాడియా తిరిగి ఎన్నికయ్యారు.
2025-2030 వరకు ఐదేళ్ళ పదవీకాలానికి ఎన్నిక నిర్వహించగా పవాడియా41 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన అభ్యర్ధికి 30ఓట్లు లభించాయి. 70 ఏళ్ల జగ్జిత్ పవాడియా భారత ప్రభుత్వంలో 35ఏళ్ళ పాటు వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే మహిళల స్థితిగతులపై కమిషన్కు కూడా భారత్ ఎన్నికైంది. దీనితో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇతర కార్యనిర్వాహక బోర్డులకు కూడా ఎన్నికైంది. ఐరాస అనుబంధ సంస్థల్లో గల 17ఖాళీలను భర్తీ చేయడానికి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి (ఇసిఓఎస్ఓసి) మంగళవారం ఎన్నికలు నిర్వహించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఇదే విషయాన్ని ఎక్స్లో పోస్టు ద్వారా తెలియచేశారు.