కతార్ అమీర్తో మోడీ భేటీ
దోహా : భవిష్యత్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ కతార్ అమీర్తో భేటీ సందర్భంగా పేర్కొన్నారు. కతార్ పాలకుడు షేక్ తమిమ్ బిన్ హమద్తో సమావేశమై పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించామని చెప్పారు. వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల మార్గాలను చర్చించినట్లు చెప్పారు. మన భూగోళానికి ప్రయోజనాలు కలిగించగల భవిష్యత్ రంగాల్లో కూడా సహకారం కోసం చూస్తున్నట్లు తెలిపారు. యుఎఇలో రెండు రోజుల పర్యటన అనంతరం బుధవారం రాత్రి కతార్ రాజధాని దోహాకు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం కతార్ ప్రధానితో కూడా భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈనాడు అందరినీ కలుపుకుని పోయే ప్రభుత్వాలే ప్రపంచానికి అవసరమని అంతకుముందు దుబారులో మోడీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరినీ మనతో పాటూ ముందుకు తీసుకుని వెళుతూ అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలన్నారు.