ప్రపంచ యుద్ధాలపై ఎఐ ప్రభావం పడుతుంది : పుతిన్‌

Feb 9,2024 17:51 #Vladimir Putin

మాస్కో : ప్రపంచ యుద్ధాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) ప్రభావం పడనుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. ఆయన తాజాగా ఫాక్స్‌ న్యూస్‌ జర్నలిస్టు టక్కర్‌ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో.. ఉక్రెయిన్‌ యుద్ధంపైన, ప్రపంచ యుద్ధాలపై ఎఐ ప్రభావం ఏ మేరకు పడనుందో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధం గురించి మాట్లాడుతూ.. ‘2022లో రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రారంభమైన కొద్దికాలానికే ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి ఒప్పందానికి రష్యా- ఉక్రెయిన్‌లు దాదాపు అంగీకారం తెలిపాయి. కానీ పశ్చిమ దేశాల ఆదేశానుసారం ఉక్రెయిన్‌ ఆ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించింది. ప్రత్యేకించి శాంతిని వ్యతిరేకించిన వారిలో అప్పటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా ఒకరు. ఇప్పటికైనా పశ్చిమ దేశాలు కానీ, ఉక్రెయిన్‌ కానీ శాంతిని గురించి ఆలోచించాలి. ఉక్రెయిన్‌ యుద్ధం కోసం.. ప్రత్యేకించి ఉక్రెయిన్‌కి ఆయుధాల పంపిణీ కోసం అమెరికా ఎందుకంత ఖర్చు చేస్తోంది? అలా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు అమెరికాకు ఇది అవసరమా? అమెరికా, జార్జియా, పోలాండ్‌ దేశాల నుంచి వచ్చిన కిరాయి సైనికులు ఉక్రెయిన్‌ కోసం పోరాడుతున్నారు. ప్రపంచ యుద్ధం మొత్తం మానవాళి అంతరించిపోయే అంచుకు తీసుకువస్తుందనేది స్పష్టం. 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత రష్యా ‘నాగరిక ప్రజలు’ అని పిలవబడే కుటుంబంలో భాగం కావాలని కోరుకుంది. అయితే నాటో తూర్పువైపు విస్తరించడంతో దాని ఆశలు ఆవిరైపోయాయి. ప్రస్తుతం వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంగా పశ్చిమ దేశాలు రష్యా కంటే చైనాకే ఎక్కువ భయపడుతున్నాయి.’ అని ఆయన అన్నారు. అలాగే పుతిన్‌ ఈ ఇంటర్వ్యూలో ఎఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘రోమన్‌ సామ్రాజ్య పతనం సమయంలో కంటే ప్రపంచం వేగంగా మారుతున్నది. ప్రస్తుతం జన్యుశాస్త్రవేత్తలు సూపర్‌మ్యాన్‌ని సృష్టించగలరు. దీనికి ఉదాహరణగా ఎలోన్‌ మస్క్‌ మానవ మెదడులో చిపన్‌ ఉంచారు అంటూ ఆయన చమత్కరించారు. అయితే సాంకేతికంగా అభివృద్ధి చెందినా.. పురోగతి సాధించినా.. మానవత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం వేళ అణు ఆయుధ నియంత్రణకు మార్గదర్శకాలుగా కృత్రిమ మేథస్సును ఉపయోగించాలి అని పుతిన్‌ సూచించారు. ఎఐ అనియంత్రిత అభివృద్ధిని ఆపలేమని ఒక అవగాహనకు వచ్చినప్పుడు, మొత్తం మానవాళికే ముప్పు వాటిల్లుతుందనుకున్నప్పుడు దీన్ని ఎలా నియంత్రించాలనే దానిపై అంత:రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతాయని తనకు అనిపిస్తోందని పుతిన్‌ అన్నారు.

అమెరికా పౌరుడైన గెర్ష్‌కోవిచ్‌ను గూఢచర్యం ఆరోపణలపై 2023 మార్చి 29న ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బి) యెకాటెరిన్‌బర్గ్‌లోని యురల్స్‌ నగరంలో 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. అయితే గెర్ష్‌కోవిచ్‌ రష్యాలోని జైల్లో ఉంచడంలో అర్థం లేదు. అతన్ని అమెరికాకు అప్పగించేందుకు మేం సిద్ధంగా ఉన్నాము. దీనికనుగుణంగా చర్చలు జరుగుతున్నాయి. అని పుతిన్‌ అన్నారు.

➡️