రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
జైపూర్ : రాజస్థాన్లో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షులు సుఖ్దేవ్ సింగ్ గోగమేది దారుణహత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. రాజధాని జైపూర్లో రాజ్పుత్లు బంద్ నిర్వహించారు. జైపూర్తో పాటు బుండి, అజ్మేర్, మధోపూర్, చిత్తోర్ఘఢ్ వంటి జిల్లాలోనూ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు మూసివేశారు. జైపూర్లోని ఖాతిపురా రహదారిని ఆందోళనకారులు దిగ్భంధించారు. సుఖదేవ్ సింగ్ గోగమేది మృత దేహాన్ని ఉంచిన మెట్రో మాస్ ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో కర్ణిసేన మద్దతుదారులు మోహరించారు. గోగమేది హత్యకు రాష్ట్ర పోలీసులదే బాధ్యత అని రాజ్పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షులు మహిపాల్ సింగ్ మక్రాన్ ఆరోపించారు. ‘గోగమేది హత్య గురించి పంజాబ్ పోలీసుల నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది. కానీ రాజస్థాన్ పోలీసులు ఆయనకు భద్రత కల్పించ లేదు. ఇది పోలీసుల వైఫల్యం’ అని మక్రాన్ స్పష్టం చేశారు. డిజిని తొలగించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు. గోగమేది హత్యపై కేవలం రాజ్పుత్లే కాకుండా ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గోగమేది కుటుంటానికి రూ. 11 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆందోళనకారలు డిమాండ్ చేశారు. ఉదరుపూర్లో జిల్లా కలెక్టరేట్ ముందు వేలాది మంది ఆందోళన నిర్వహించారు. వేగంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్్ చేశారు. జైపూర్లో శ్యామ్ నగర్ మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్న మార్కెట్లు వద్ద కర్ణిసేన మద్దతుదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టైర్లను దగ్ధం చేశారు. గవర్నర్ను కలిసిన సిఎస్రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉషా శర్మతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా సమావేశం జరిపారు. సుఖ్దేవ్ సింగ్ గొగమేది హత్యపై విచారణ కోసం ఎడిజి (క్రైమ్) దినేష్ ఎంఎన్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. హత్య కేసులో నిందితుల గురించి సమాచారం ఇస్తే రూ. 5 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు. నిందితులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మీడియాకు తెలిపారు. నిందితుల్లో ఒకరు హర్యానాకు, మరొకరు రాజస్థాన్కు చెందిన వారిని చెప్పారు.