- రైతు, కార్మిక విరోధి మోడీ సర్కార్
- 23న దేశవ్యాప్త ఆందోళనలు
- ఎంఎస్పి చట్టాన్ని చేయాలి
- బిజెపిని తరిమికొట్టాలి… దేశాన్ని రక్షించాలి
- చారిత్రాత్మకంగా కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బడా పారిశ్రామిక వేత్తలతో కలిసి దేశ సంపదను దోచుకుంటున్న మోడీ ప్రభుత్వంపై కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ రణభేరీ మోగించింది. గురువారం రాంలీలా మైదానంలో ఎస్కెఎం ఆధ్వర్యంలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపు మేరకు లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు పాల్గొన్నారు. మహిళలు, విద్యార్థులు, యువకులు, న్యాయవాదులు, మేధావులు, రచయితలు సంఘీభావం తెలిపారు. కిసాన్ మజ్దూర్ మహా పంచాయితీని జయప్రదం కాకుండా అడ్డుకునేందుకు కేంద్రం చేసిన అన్ని ప్రయత్నాలను రైతులు, కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టారు. కేవలం ఐదు వేల మందిని మాత్రమే ఢిల్లీకి అనుమతిస్తామన్న పోలీసుల తీరుకు చెంపపెట్టుగా లక్షన్నర మంది హాజరయ్యారు. చరిత్రాత్మక మహా పంచాయితీలో అపూర్వమైన మహిళల భాగస్వామ్యం ఉంది. పంజాబ్, హర్యానా వంటి సమీప రాష్ట్రాల నుంచే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి రైతులు, వ్యవసాయ కార్మికులు కదలి వచ్చారు. ఉదయం తొమ్మిది గంటలకే మైదానం దాదాపు నిండిపోయింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి బుధవారం రాత్రి బురద నీటితో మైదానాన్ని నింపి పోలీసుల కుయుక్తులు అన్నదాతల ముందు ఫలించలేదు. బిజెపిని తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి అంటూ నినాదాలు మార్మోగాయి.
కేంద్రంపై ఉద్యమం ఉధృతం
లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని మహా పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. యునైటెడ్ పీపుల్స్ మూవ్ మెంట్ ఫోరంను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిల్లో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కేంద్రంపై ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. హర్యానాలో యువ రైతు శుభకరన్ సింగ్ను కాల్చి చంపి రైతులను అణిచివేసేందుకు కారణమైన కేంద్ర హౌంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మహా పంచాయతీ డిమాండ్ చేసింది. అమిత్ షాతో పాటు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, మాజీ హోంమంత్రి అనిల్ విజ్లపై హత్యానేరం మోపాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలని తెలిపింది. లఖింపుర్ఖేరీ రైతు మారణకాండ సూత్రధారి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా బిజెపి నంచి మళ్లీ పోటీ చేయడాన్ని నిరసిస్తూ 23న అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ
కార్యక్రమంలో ఎస్కెఎం నేతలు అశోక్ దావలే, విజూ కృష్ణన్, హన్నన్ మొల్లా, కృష్ణ ప్రసాద్, రాకేష్ టికాయిత్, దర్శన్పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, బల్బీర్ సింగ్ రాజేవాల్, సునీలం, సత్యవాన్, రావుల వెంకయ్య, హర్మీత్ కడియన్, బసవ రాజప్ప, లింగరాజ్ ఆజాద్, వికాస్ సిసార్, తేజిందర్ సింగ్ విర్క్, గుర్నామ్ సింగ్ చదువుని, అవిక్ సాహా, మేధా పాట్కర్, రాజారామ్ సింగ్, హరీందర్ లఖోవల్, కుల్వంత్ సంధు, చమ్రాసా మాలి పాటిల్, జోగిందర్ నయన్, జగ్తార్ బజ్వా, మంజీత్ ధనేర్, సుభాష్ కకుష్టే, సురేష్ కౌత్, రాజేంద్ర చౌదరి, అశోక్ బైతా, జంగ్వీర్ చౌహాన్, సత్యదేవ్ పాల్, బూటా సింగ్ బుర్జ్గిల్, రాజిందర్ సింగ్ దీప్సింగ్వాలా తదితరులు పాల్గొన్నారు.