న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడనుంది. 24 గంటల్లో ఆ రెండు స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సిఇసి) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి అధికారాన్ని కల్పించిందని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
కాంగ్రెస్ తాజాగా మంగళవారం విడుదల చేసిన జాబితాలో కూడా ఆరెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. దీంతో ప్రకటన ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ అమేథీలోని పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు నిరసన చేపట్టారు. ‘అమేథీ గాంథీ కుటుంబాన్ని డిమాండ్ చేస్తోంది” అని రాసి వున్న ప్లకార్డులు ప్రదర్శించారు.