భువనేశ్వర్ : ఒడిశాలోని బిజెడికి గట్టి షాక్ తగిలింది. బిజెడి (బిజు జనతా దళ్) సిట్టింగ్ ఎంపి అనుభవ్ మొహంతి రెండు రోజుల క్రితం (శనివారం) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. తాజాగా సోమవారం మొహంతి బిజెపిలో చేరాడు. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో మొహంతి కాషాయ కండువా కప్పుకున్నారు.
కాగా, అనుభవ్ మొహంతి కేంద్రపార నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిజెడిలో కీలక నేతగా ఉన్న ఆయన తన తండ్రి, పెదతండ్రి మరణించడంతో మానసికంగా చాలా కుంగిపోతున్నానని, రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నానని, అందుకే తాను రాజీనామా చేస్తున్నాని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో అనుభవ్ పార్టీని వీడి బిజెపిలోకి చేరడంతో బిజెడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.