నలుగురు సైనికులు మృతి
మరో ముగ్గురికి గాయాలు
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డ్డారు. భద్రతాబలగాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలోని పిర్ పంజల్ వ్యాలీ వద్ద సైనికులతో ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై సాయంత్రం 3:45 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. రాజౌరీ జిల్లాలోని డేరా కి గాలి, థనమంది వద్ద బుధవారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వాహనాల్లో జవాన్లు ఆ ప్రదేశానికి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. సైనికుల సైతం ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి అదనపు బలగాలతోపాటు అంబులెన్స్లను తరలించినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు కోసం ఈ ప్రాంతంలో సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.