అగర్తల: తొలి విడతలో పశ్చిమ త్రిపుర లోక్సభ స్థానానికి శుక్రవారం జరిగిన ఎన్నికలో బిజెపి పెద్దయెత్తున రిగ్గింగ్కు పాల్పడినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. పలు చోట్ల బిజెపి రిగ్గింగ్, హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. బిజెపిీ మద్దతు ఉన్న గూండాలు ప్రతిపక్షాల పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి పోలింగ్ బూత్లను ఆక్రమించారని, ఎన్నికలను ప్రహసనంగా మార్చారని సిపిఎం బలపరిచిన కాంగ్రెస అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహా ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కేంద్ర బలగాలు చేష్టలుడిగినట్లు వ్యవహరించాయని ఆయన విమర్శించారు. పశ్చిమ త్రిపురలోని ఉదరుపూర్, బిలోనియా, సోనామురా సహా పలు ప్రాంతాల నుంచి పోలింగ్ ఏజెంట్లపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆశిష్ కుమార్ సాహా ఆరోపించారు.రిటర్నింగ్ అధికారి విశాల్ కుమార్, ఎస్పీ కిరణ్ కుమార్లతో మాట్లాడి సంఘటనా స్థలంలో పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాహా ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది.