న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై కాంగ్రెస్ మండిపడింది. కాశ్మీర్ దుస్థితికి నెహ్రూ చేసిన రెండు తప్పిదాలే కారణమంటూ షా వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందింస్తూ ‘పిఒకె అంశంపై ఒక రోజంతా కచ్చితంగా చర్చ జరపాలి. అమిత్ షా చెబుతునట్లు నెహ్రూ తప్పు చేశారనే అనుకుందాం. అయితే, 2019లో పిఒకెను వెనక్కి తీసుకువస్తామని కేంద్రంలో బిజెపి హామీ ఇచ్చింది. మరి.. పీఓకేను తీసుకోకుండా మిమల్ని అడ్డుకున్నదెవరు?” అంటూ ప్రశ్నించారు. అలాగే, పిఒకే మీదుగా సీపెక్ (చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్) ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతోంది. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. 2024 ఎన్నికల లోగా పీఓకేను వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, పీవోకేను వెనక్కి తీసుకురావడం అంటుంచి కనీసం ముందైతే ఒక యాపిల్ను తీసుకురండి అంటూ సవాల్ విసిరారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ.. చేతల్లో మాత్రం వాటిని నిరూపించుకోలేరు అంటూ ఎద్దెవా చేశారు.