భువనేశ్వర్ : ఒడిశా కాంగ్రెస్ ఎంపి ధీరజ్ సాహు నివాసంపై ఆదాయపు పన్ను శాఖ (ఐటి ) అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఆయన నివాసం నుండి రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 6 (బుధవారం) నుండి సాహుకు చెందిన ఒడిశా, జార్ఖండ్ నివాసాల్లో ఐటి శాఖ సోదాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ధీరజ్ సాహు కుటుంబం పెద్ద ఎత్తున మద్యం తయారీ వ్యాపారంలో పాల్గొంటోంది. అతనికి ఒడిశాలో అనేక మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి.
నగదు స్వాధీనం చేసుకున్న ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన పలు ప్రదేశాల్లో దాడులు కొనసాగుతున్నట్లు ఐటి శాఖ శుక్రవారం తెలిపింది. సంబల్ పూర్, బోలంగీర్, తితిలాగఢ్, బౌధ్, సుందర్ఘర్, రూర్కెలా, భువనేశ్వర్లలో దాడులు జరుగుతున్నాయి. పట్టుబడిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్స్, 30 మందికి పైగా అధికారులను వినియోగిస్తున్నట్లు ఐటి అధికారులు తెలిపారు. భువనేశ్వర్ లో జరుగుతున్న దాడులను ఐటి డైరెక్టర్ సంజయ్ బహదూర్ పర్యవేక్షిస్తున్నారు. సుందర్ఘర్ సిటీలోని లిక్కర్ కంపెనీ, భువనేశ్వర్లోని బిడిపిఎల్ కార్పోరేట్ ఆఫీస్, రాణిసాటి రైస్మిల్ కంపెనీల్లోనూ సోదాలు చేపడుతున్నట్లు తెలిపారు.