హర్యానా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

చండీగఢ్‌ : హర్యానాలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బిజెపి-జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ గురువారం నాడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పంజాబ్‌ – హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆందోళన, వారిపై పోలీసుల దమనకాండ సహా పలు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ సభ్యులు నిలదీశారు. కనీస మద్దతు ధర కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువ రైతును బిజెపి ప్రభుత్వం కాల్చి చంపిందని కాంగ్రెస్‌ సభ్యులు షంషేర్‌ సింగ్‌ గోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దులో పరిస్థితి చాలా దారణంగా ఉందని ప్రతిపక్ష నేత భూపిందర్‌ సింగ్‌ హుడా ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు చర్చ సాగింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చర్చ అనంతరం ప్రతిపక్ష సభ్యులు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం మూజువాణీ ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ జియాన్‌ చంద్‌ గుప్తా ప్రకటించారు. 90 అసెంబ్లీ స్థానాలు కలిగిన హర్యానాలో బిజెపికి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జెజెపికి 10 మంది ఉన్నారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులలో ఆరుగురు, లోఖిత్‌ పార్టీ ఎమ్మెల్యే గోపాల్‌ కందా కూడా బిజెపికి మద్దతిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి)కి ఒకరు ఉన్నారు. మూడేళ్ల క్రితం కూడా బిజెపి -జెజెపిపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చింది. అయితే అది వీగిపోయింది.

➡️