తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సిపిఎం అగ్రనాయకులు

Nov 16,2023 11:15 #cpm, #cpm leaders, #elections, #Telangana
  • 25 నుంచి 27 వరకు ఏచూరి,
  • 24 నుంచి 26 వరకు మాణిక్‌ సర్కార్‌
  • 25 నుంచి 28 వరకు బృందాకరత్‌ ప్రచారం
  • 24న సుభాషిణీ అలీ, 20న విజయరాఘవన్‌,
  • 19న రాఘవులు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిపిఎం అభ్యర్థుల గెలుపుకోసం ఆ పార్టీ జాతీయ నాయకులు రానున్నారు. వారి పర్యటనలు ఖరారయ్యాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, సుభాషిణీ అలీ, ఎ.విజయరాఘవన్‌, బివి రాఘవులు రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 25న పాలేరు, 26న మిర్యాలగూడ, 27న భువనగిరి నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థుల గెలుపు కోసం సీతారాం ఏచూరి వివిధ బహిరంగసభలు, రోడ్‌షోలను నిర్వహిస్తారు. ఈ నెల 24న ఖమ్మం, 25న ముదిగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు, 26న భద్రాచలం, పాలేరు నియోజకవర్గం కూసుమంచి సభలు, రోడ్‌షోల్లో మాణిక్‌ సర్కార్‌ పాల్గొంటారు. ఈ నెల 25న వైరా నియోజకవర్గంలో రోడ్‌షో, మధిర నియోజకవర్గం బోనకల్‌లో సభ, 26న ఇబ్రహీంపట్నం సభలో, 27న భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, 28న కోదాడ, హుజూర్‌నగర్‌లలో బృందాకరత్‌ రోడ్‌షోలకు హాజరవుతారు. ఈ నెల 24న జనగాం, హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ సభల్లో సుభాషిణీ అలీ పాల్గొంటారు. ఈ నెల 20న భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం సభకు ఎ.విజయరాఘవన్‌ హాజరవుతారు. ఈ నెల 19న పటాన్‌చెరు నియోజకవర్గం సభలో బివి రాఘవులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ఓటర్లకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

➡️