న్యూఢిల్లీ : పాఠశాలలో ఎయిర్ కండిషనింగ్కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. లేబరేటరీ ఫీజ్, స్మార్ట్ కార్డ్ ఫీజ్ వంటి ఇతర ఛార్జీల నుండి భిన్నంగా లేదని తెలిపింది. విద్యార్థులకు ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రైవేటు యాజమాన్యాలపై ఉన్నా అదనంగా రూ.2,000 చొప్పున వసూలు చేస్తున్నారని, సొంత నిధులు, వనరులతో పాఠశాలలే వాటిని అందించాలని పేర్కొంటూ దాఖలైన పిల్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ ఆర్థిక భారం పాఠశాల యాజమాన్యం మాత్రమే భరించదని, తల్లిదండ్రులు పాఠశాలలను ఎంపిక చేసుకునేటప్పుడు పాఠశాలలో పిల్లలకు కల్పించే సౌకర్యాలు, వాటి ఖర్చులపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎయిర్ కండిషనింగ్ ఛార్జీల రసీదును పాఠశాల సక్రమంగా నమోదు చేస్తుందని, ప్రాథమికంగా పాఠశాల విధించే ఛార్జీలో ఎలాంటి అవకతవకలు లేవని పేర్కొంది. పాఠశాల యాజమాన్యంపై మాత్రమే ఇటువంటి సౌకర్యాలకు సంబంధించిన ఆర్థిక భారాన్ని వేయలేమని జస్టిస్ మన్మీత్ పి.ఎస్. అరోరాతో కూడిన ధర్మాసనం ఈ నెల 2న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.