ముంబయి : శివసేన (యుబిటి) ఎమ్మెల్యే రవీంద్ర వైకర్, అనుబంధ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) దాడులు చేపడుతోంది. మంగళవారం ఉదయం నుండి ముంబయిలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నగరంలోని జోగేశ్వరీ ప్రాంతంలో లగ్జరీ హోటల్ నిర్మాణంలో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ దాడులు జరుగుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఉద్ధవ్ బాలసాహెబ్ థాకరే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే, మహారాష్ట్ర అసెంబ్లీలో జోగేశ్వరి తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రవీంద్ర వైకర్ నివాసంతో పాటు ఆయన తల్లిదండ్రులు, ఇతరుల నివాసాలపై ఈడి అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. తోట కోసం కేటాయించిన ప్లాట్ను అక్రమంగా ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే చట్టవిరుద్ధంగా ఆమోదం పొందారని ముంబయి పోలీస్ ఆర్థిన నేరాల విభాగం (ఇఒడబ్ల్యు) ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ డీల్ కారణంగా బృహన్ ముంబయి మునిసిపల్ కార్పోరేషన్ (బిఎంసి)కి భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించింది.