న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కోసం చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తూ.. రైతుల ఢిల్లీ చలో యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. శంభు సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసుల బారికేడ్లు, ఇనుప చువ్వలను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. మొక్కజన్న, పత్తి, మూడు రకాల పప్పుధాన్యాలను పాత ఎంఎస్పికి కోనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను సోమవారం సాయంత్రం రైతు నేతలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. 23 వాణిజ్య పంటలకు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ ప్రతిపాదనకు అనుగుణంగా ఎంఎస్పిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అన్ని పంటలకు ఎంఎస్పి చట్టం తీసుకురావాలని, ఇందు కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎంఎస్పిని కొన్ని పంటలకు మాత్రమే వర్తింపజేయడం సమంజసం కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.