ఘోర దుర్ఘటన – గుడిసెలపైకి దూసుకెళ్లిన బస్సు – నలుగురు కూలీలు మృతి

గోవా : దక్షిణ గోవాలో ఘోర దుర్ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల కథనం మేరకు … గోవాలోని వెర్నా ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ వద్ద వలస కూలీలు వారి గుడిసెల్లో నిద్రిస్తుండగా నిన్న అర్థరాత్రి 11 గంటల 30 నిముషాల సమయంలో ఓ బస్సు గుడిసెల పైకి దూసుకొచ్చింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గయపడిన మరో ఐదుగురిని మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో తనకు ఫోన్‌ రావడంతో గుడిసెలో నుంచి బయటకు వచ్చానని తాను చూస్తుండగానే బస్సు వేగంగా వచ్చి రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షి రూపేందర్‌ మాథుర్‌ అనే కూలీ తెలిపారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమన్నారు. ఘటనలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని డ్రైవర్‌ బెదిరించినట్లుగా వాపోయాడు. బాధితులకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బంది జాప్యం చేయడంతో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశామన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️