శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. భద్రతా బలగాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. నాయక్ బీరేంద్ర సింగ్; నాయక్ కరణ్ కుమార్, రైఫిల్ మాన్ చందన్ కుమార్ మరియు రైఫిల్మాన్ గౌతమ్ కుమార్లు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. సందీప్ కుమార్, శ్యామ్ సుందర్ దాస్, తోడ్మల్ జ్ఞానేశ్వర్ భాస్కరరావులు గాయపడ్డారని, వారిలో ఒకరు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 20 నుండి పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా, రాజౌరీ జిల్లాలోని పిర్ పంజల్ వ్యాలీ వద్ద సైనికులతో వెళుతున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.