న్యూఢిల్లీ : వ్యవసాయం, ఆహారం, వాణిజ్య అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల ట్రేడ్ యూనియన్ 5వ అంతర్జాతీయ సమావేశం ఈ ఏడాది ఏప్రిల్ 9 నుండి 14 వరకు పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్లో జరగనుంది. ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలతో పాటు కొనసాగుతున్న ఉద్యమంపై ఈ సదస్సులో కూలంకషంగా చర్చించనున్నారు. వివిధ దేశాలలోని కార్మికులపై సామ్రాజ్యవాదం, నయా ఆర్థిక విధానాల ప్రతికూల ప్రభావాన్ని కూడా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికుల నిరంతర పోరాటాలను పంచుకుని ఈ అనుభవాల ఆధారంగా భాగస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలతో భవిష్యత్ ప్రతిఘటన పోరాటం ప్రణాళిక రూపొందించనున్నారు. భారత్ నుండి ఐదుగురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అఖిల భారత కిసాన్ సభ నుండి విజు కృష్ణన్, పి.కృష్ణ ప్రసాద్, అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ నుండి బి. వెంకట్, విక్రమ్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ (అజోయ్ భవన్ ) వంకేయ, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ నుండి గుల్జార్ సింగ్ గోరియా, వి.ఎస్. నిర్మల్లు హాజరుకానున్నారు.