ఐసియులో గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ..!

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ ఆరోగ్యం క్షీణించడంతో అతనికి చికిత్స అందించడానికి జైలు నుంచి బందా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి అధికారులు తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసియులో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో పోలీసులు మెడికల్‌ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అన్సారీ కోర్టు న్యాయవాదికి లేఖ రాశారు.

బందా జైలులోని జైలర్‌, ఇద్దరు డిప్యూటీ జైలర్లు సస్పెండ్‌…
కొద్ది రోజుల క్రితం ముఖ్తార్‌ అన్సారీ తన ప్రాణాలకు ముప్పు ఉందని, ముక్తార్‌ అన్సారీ తనపై విషం ప్రయోగించడానికి కుట్ర జరుగుతున్నదంటూ కోర్టుకు లేఖ ద్వారా విన్నవించారు. ఒక కేసులో ముఖ్తార్‌ అన్సారీ గత గురువారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అన్సారీ తనకు ప్రాణహాని ఉందంటూ న్యాయవాది ద్వారా న్యాయమూర్తికి లేఖ పంపారు. మార్చి 19న తనకు ఇచ్చిన ఆహారంలో విషపూరితమైన పదార్థాలు కలిశాయని ముఖ్తార్‌ అన్సారీ ఆ లేఖలో రాశారు. ఆ ఆహారం తిన్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని, తనకు చేతులు, కాళ్ల నరాల్లో విపరీతమైన నొప్పి వచ్చిందని ముఖ్తార్‌ అన్సారీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆరోజు తాను చనిపోతానేమోనని భయపడ్డానని అన్సారీ లేఖలో వివరించారు. ఈ విషయమై స్పందించిన కోర్టు అన్సారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బందా జైలులోని జైలర్‌, ఇద్దరు డిప్యూటీ జైలర్లను సస్పెండ్‌ చేసింది.

ఘాజీపూర్‌ నకిలీ ఆయుధాల లైసెన్స్‌ కేసుకు సంబంధించి ముఖ్తార్‌ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) అవ్నీష్‌ గౌతమ్‌ ముఖ్తార్‌ అన్సారీకి ఈ శిక్ష విధించారు. 2023లో జరిగిన ఒక హత్య కేసులో ముఖ్తార్‌ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ముక్తార్‌కు ఇప్పటివరకు ఏడు కేసుల్లో శిక్ష పడింది. ఎనిమిదో కేసులో దోషిగా తేలాడు.

➡️