చెన్నైలో భారీ వర్షాలు.. స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

తమిళనాడు (చెన్నై) : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో ఆదివారం నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నాలుగు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ విధించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూల్స్‌, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. చెన్నైలోని అడయార్‌, అన్నాసాలై, వేప్పేరి, గిండి, కోయంబేడులో ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. నాగపట్నం, కరైకల్‌, పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

➡️