IMD: పుష్కలంగా వర్షాలు.. 

Apr 16,2024 08:50 #IMD, #monsoon, #rainfall
  • ఐఎండి అంచనా

న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉంటాయని మొన్న స్కైమెట్‌ చెప్పగా, నేడు భారత వాతావరణశాఖ (ఐఎండి) దానిని మరింత నొక్కి చెప్పింది. గతేడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా 106 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు కూడా ముందుగా జులై నాటికే దేశం అంతటా విస్తరించే అవకాశం వుందని సోమవారం పేర్కొంది. ఆగస్టు-సెప్టెంబరు నాటికి లా నినా పరిస్థితులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఈ వివరాలను ఇక్కడ జరిగిన విలేకరులు సమావేశంలో ఐఎండి చీఫ్‌ మృత్యుంజరు మహపాత్ర వెల్లడించారు. నాలుగు నెలల (జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు) రుతుపవనాల సీజన్‌ల్లో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, దీర్ఘకాల వర్షపాతం సగటు (87 సెంమీ) సంచిత వర్షపాతం 106 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ వర్షకాలంలో హిందూ మహాసముద్రంపై పరిస్థితులు మేఘాల కదలికలకు అనుకూలంగానే ఉంటాయని, ఉత్తరార్ధ గోళంలో మంచు కవచం తక్కువగానే ఉంటుందని. ఇవన్నీ రుతుపవనాలకు సానుకూల అంశాలని చెప్పారు. ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ఒక మోస్తరుగా నెలకొని ఉన్నాయని, వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఇది కొంచెం తగ్గుతుందని, ఆ తరువాత అంటే ఆగస్టు-సెప్టెంబరు నాటికి లా నినా పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎల్‌నినో ఉంటే వేడిగాలులు, లా నినా ఉంటే ఎక్కువ వర్షాలకు అనుకూలంగా ఉంటుంది. గత ఏడాదిలో ఎల్‌నినో కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది.
దేశంలో వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షం రుతుపవనాల కారణంగానే కురుస్తుంది. వ్యవసాయ రంగానికి ఇది ఎంతో కీలకం. అలాగే, మహారాష్ట్రల్లోని ముంబయి, థానే, రారుగఢ్‌ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడగాడ్పులు ఉండే అవకాశముందని ఐఎండి హెచ్చరించింది. ఈ మూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌ వరకూ నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

➡️