న్యూఢిల్లీ : ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఇఎఫ్టిఎ)తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అనేక పారిశ్రామిక ఉత్పత్తులపై ముఖ్యమైన సుంకాలను ఎత్తివేసేందుకు భారత్ అంగీకరించింది. దీనికి ప్రతిగా ఇఎఫ్టిఎ దేశాలు వచ్చే 15 ఏళ్లలో భారత్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం భారత్, ఇఎఫ్టిఎ మధ్య గత 16 ఏళ్ల వ్యవధిలో అనేక రౌండ్లు జరగడం విశేషం. ఇఎఫ్టిఎలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లైచ్తెనెస్టియా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ నాన్ యురోపియన్ దేశాలు. ఎగుమతులను పెంచడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉపాధిని సృష్టించడం వంటి లక్ష్యాల సాధనకే ఇఎఫ్ఎటితో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అయితే భారత్ నుంచి ఇఎఫ్ఎటి దేశాలకు 2022-23 నాటికి ఎగుమతులు 1.92 బిలియన్ డాలర్లు ఉండగా, ఈ దేశాల నుంచి దిగుమతులు మాత్రం 16.74 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.