అమానవీయం.. విద్యార్థులతో సెప్టెక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్‌

Dec 18,2023 20:04 #Karnataka, #school

కోలార్‌ : కర్ణాటకలోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించిన ఘటన యాజమాన్యం. స్వయంగా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దగ్గరుండి మరీ విద్యార్థులతో సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. కోలార్‌ జిల్లాలోని మొరార్జీ దేశారు రెసిడెన్షియల్‌ స్కూల్లో ఇటీవల 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాఠశాలలోని సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేయించారు. ఐదారుగురు విద్యార్థులను బలవంతంగా లోపలికి దించి మరీ ట్యాంక్‌ను కడిగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను అదే స్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులతో సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించడంపై స్కూల్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రిన్సిపల్‌, ఇద్దరు టీచర్లు, హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్‌, ఓ టీచర్‌ను అరెస్టు చేశారు. దీనిపై ఏకంగా రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

➡️