రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని అడ్డుకోండి

Kerala Moves Supreme Court Against Centre; Accuses Of Damaging Economy, Violating Financial Federalism

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం
కేంద్రం చర్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,07,513.09 కోట్లు వ్యయ నష్టం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం కేరళ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని, రుణం తీసుకునే అధికారాన్ని పరిమితం చేస్తోందని విమర్శించింది. కేంద్రం చర్యలు సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని వాదించింది. ఎగ్జిక్యూటివ్‌ చర్యలతో కేంద్ర ప్రభుత్వం ”తన బడ్జెట్‌ ప్రక్రియపై నియంత్రణను తీసుకుంది. రాష్ట్రానికి రుణాలు తీసుకునే స్వంత ఆర్థిక వ్యవస్థలను నియంత్రించే అధికారంలో కేంద్రం జోక్యం చేసుకుంది” అని కేరళ ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 131 ప్రకారం కేరళ తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో దావా వేసింది. కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితిని విధించడం వల్ల సంవత్సరాలుగా చెల్లించని బకాయిలు పేరుకుపోతున్నాయని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో 2016-2023 ఆర్థిక సంవత్సరంల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,07,513.09 కోట్ల సంచిత వ్యయ నష్టం, వనరుల లోటును చవిచూసిందని కోర్టు తెలిపింది. ఈ కారణంగానే రాష్ట్రం తన వార్షిక బడ్జెట్‌లో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయిందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్వయం ప్రతిపత్తికి అనుగుణంగా రాష్ట్రానికి చెందిన కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ భద్రత లేదా హామీపై రుణం తీసుకోవడానికి రాష్ట్రానికి ప్రదానం చేసిన కార్యనిర్వాహక అధికారాన్ని కేరళ ప్రభుత్వం ప్రస్తావించింది. ”రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే రాజ్యాంగ హక్కు, అధికారం కేంద్రానికి లేదు. ఇది రాష్ట్రం ప్రత్యేక ఆర్థిక డొమైన్‌లను అతిక్రమించడంతో సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది” అని కేరళ పేర్కొంది. కాగా, ఈ కేసు వచ్చే ఏడాది జనవరిలో విచారణకు రావచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు శీతాకాల సెలవులు డిసెంబర్‌ 16 (శనివారం) నుండి ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది జనవరి 02 (మంగళవారం)న తిరిగి సుప్రీంకోర్టు పునఃప్రారంభం కానుంది.కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుండి తక్షణ జోక్యాన్ని కోరింది. కేరళ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందని, ఇది కేరళ వంటి చిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ”నష్టాన్ని నివారించకపోతే, కేరళ రాష్ట్రం, దాని కొద్దిపాటి వనరులతో, దశాబ్దాల పాటు దీని నుండి కోలుకోలేము” అని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక జోక్యాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రెండో రాష్ట్రం కేరళ. గతంలో, పంజాబ్‌ ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం విధించిన రూ.4,000 కోట్లకు పైగా చట్టబద్ధమైన రుసుములను రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది.

➡️