- సజీవ దహనానికి యత్నం
- మధ్యప్రదేశ్లో దారుణం
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మరో మహిళతో కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. 34 ఏళ్ల మహిళ గర్భవతి. బాధితురాలి భర్తపై చాంద్ కాపురా గ్రామానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపించింది. దీంతో గర్భిణి మహిళ భర్తను అరెస్ట్ చేయగా.. అతడు ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. భర్తపై లైంగికదాడి కేసు పెట్టిన మహిళతో రాజీ కోసం గర్భిణి ప్రయత్నించింది. కేసు పెట్టిన మహిళ గ్రామానికి బాధితురాలు వెళ్లింది. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ మహిళతోపాటు ఆ ముగ్గురు కలిసి గర్బిణిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80శాతం కాలిన గాయాలైన ఆమెను గ్వాలియర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.