న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ‘అవినీతి పాఠశాల’ను నడుపుతున్నారని, ‘ఇండియా’ ఫోరం అధికారంలోకి వస్తే ఆ పాఠశాలకు తాళం పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బిజెపి నేతలకు అవినీతి పాఠాలను మోడీ చక్కగా బోధిస్తున్నారని శనివారం సామాజిక మాధ్యమాల్లో రాహుల్ పేర్కొన్నారు. అవినీతి పాఠశాలలో ‘విరాళాల వ్యాపారం’ అనే పాఠాన్ని స్వయంగా మోడీనే బోధిస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. కంపెనీలపై సోదాలు నిర్వహించి విరాళాలు ఎలా సేకరించాలి? విరాళాలు తీసుకున్న అనంతరం ఒప్పందాల పంపిణీ ఎలా చేయాలి? అనే అంశాలనూ చక్కగా వివరించగలరని ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని గుర్తు చేసేలా రాహుల్ అభివర్ణించారు. అవినీతిపరుల నేర మరకలను వాషింగ్ మెషీన్లా బిజెపి కడిగేస్తోందంటూ తప్పుబట్టారు. ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా మార్చి ‘జైలు – బెయిల్’ ఆటను ఆడుతోందని ఆయన విమర్శించారు.