మోడీ ఇలాకాలో పేపర్‌ లీకేజీల బాగోతం!

Jul 1,2024 00:50 #good for Modi!, #Paper leakages

బిజెపి మోడల్‌ రాష్ట్రం గుజరాత్‌లో పలు ప్రశ్నాపత్రాలు లీక్‌
లక్షలాది ఉద్యోగార్థుల ఆశలు ఆవిరి
న్యూఢిల్లీ : పేపర్‌ లీకేజీల కారణంగా పరీక్షలు రద్దు కావడమే కాదు. లక్షలాది మంది అభ్యర్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో పేపర్‌ లీకేజీలతో పదిహేను రాష్ట్రాలలో 41 నియామక పరీక్షలు రద్దయ్యాయి. ఫలితంగా సుమారు 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులు తీవ్రమైన నిరాశానిస్పృహలకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో, బిజెపి ప్రభుత్వ ఏలుబడిలో అనేక ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయి. పేపర్‌ లీకేజీ కుంభకోణం కారణంగా మోడీ సన్నిహితుడు, గుజరాత్‌ సెకండరీ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఛైర్మన్‌ అశిత్‌ ఓరా తన పదవికి రాజీనామా చేశారు. పేపర్‌ లీకేజి బాగోతంలో ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రమేయం ఉన్నదని వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్‌లోనే గతంలో మోడీ రాసిన ఓ పుస్తకాన్ని అచ్చు వేశారు.
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోనే కాదు… బిజెపి మోడల్‌ రాష్ట్రమైన గుజరాత్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో భారీ కుంభకోణాలే వెలుగు చూశాయి. నియామక పరీక్షల్లో పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు గత సంవత్సరం ఫిబ్రవరిలో గుజరాత్‌ ప్రభుత్వం శాసనసభలో ఓ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో గత 11 సంవత్సరాల్లో 11 పేపర్‌ లీకేజీ కేసులు నమోదయ్యాయని, 201 మంది నిందితులపై కేసులు నమోదు చేశామని, 10 కేసుల్లో చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా హోం మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పేపర్‌ లీకేజీ మూలాలు బాగా వేళ్లూనుకుపోయాయని, వాటికి బిజెపి పాలనతో సంబంధం ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలన్నింటినీ గుజరాత్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (జిఎస్‌ఎస్‌ఎస్‌బి) నిర్వహిస్తుంది. అనేక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను అహ్మదాబాద్‌లోని సూర్యా ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే ముద్రించారు. అక్కడి నుండే ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయి.
ప్రశ్నాపత్రాన్ని అమ్ముకున్నారు
2021లో హెడ్‌ క్లర్‌ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ అయింది. ఈ ఉదంతం ప్రభుత్వాన్ని కుదిపేయడంతో గుజరాత్‌ సెకండరీ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఛైర్మన్‌ అశిత్‌ ఓరా తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరీక్షకు 88 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో చివరికి పరీక్షను రద్దు చేశారు. ఈ కేసులో గుజరాత్‌ పోలీసులు 14 వేల పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. సూర్య ప్రెస్‌లోనే పేపర్‌ లీక్‌ అయిందని పోలీసులు గుర్తించారు.
అవినీతిపరుడికి అందలం
2004ా05లోనే సూర్య ప్రింటింగ్‌ ప్రెస్‌ను గుజరాత్‌ యూనివర్సిటీ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ ప్రెస్‌ రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు పరీక్షా పత్రాలు ముద్రించి ఇస్తుంది. ప్రెస్‌ యజమాని ముద్రేష్‌ పురోహిత్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపితో సంబంధాలున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అరెస్టు నుండి తప్పించుకునేందుకు ముద్రేష్‌ కోర్టు నుండి ముందస్తు బెయిల్‌ పొందారు. ఇక జిఎస్‌ఎస్‌ఎస్‌బి ఛైర్మన్‌గా వ్యవహరించిన ఓరా పదవీకాలంలో రెండు ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్‌ అయ్యాయి. ఆయన హయాంలో పరీక్షా ఫలితాల తారుమారు సహా 61 ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయనకు బిజెపి ప్రభుత్వం రెండోసారి అదే పదవిని కట్టబెట్టింది. అహ్మదాబాద్‌ మేయర్‌, మున్సిపాలిటీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సహా అనేక పదవులను ఓరా బిజెపి హయాంలో నిర్వహించారు.
ప్రభుత్వ ప్రమేయంతోనే : కాంగ్రెస్‌
గత దశాబ్ద కాలంలో ప్రభుత్వోద్యోగాలలో నియామకాలకు సంబంధించి 14 పరీక్షా పత్రాలు లీక్‌ అయ్యాయని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ చెప్పారు. 2020ా21, 2022ా23 మధ్యకాలంలో గుజరాత్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు 21 శాతం పెరిగాయి. పరీక్షా పత్రాల లీకేజీలు కూడా ఆత్మహత్యలకు కారణమయ్యాయి. ప్రభుత్వ ప్రమేయం లేకుండా పేపర్‌ లీకేజీలు ఎలా జరుగుతాయని మనీష్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో పేపర్‌ లీకేజీలు వ్యవస్థీకృత నేరంగా మారాయని మండిపడ్డారు. ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే రేటు నిర్ణయిస్తారని, లక్షలాది రూపాయలకు ప్రశ్నాపత్రాన్ని అమ్ముకుంటారని తెలిపారు.

ఇపిఎఫ్‌ఓలో తగ్గిన కొత్త సభ్యులు
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ)లో కొత్త సభ్యుల చేరిక తగ్గిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే 2023ా24లో కొత్త చందాదారుల సంఖ్య 4 శాతానికి తగ్గి 10.9 మిలియన్లకు చేరిందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. 2022ా23లో ఇపిఎఫ్‌ఓలో 11,498,453 మంది కొత్త సభ్యులు అదనంగా చేరగా 2023ా24లో 10,993,119 మాత్రమే చేరారు. నూతన సభ్యుల చేరిక తగ్గడానికి కోవిడ్‌ కూడా కారణమేనని భావిస్తున్నారు. 2019ా20లో 11,040,683 మంది కొత్త సభ్యులు చేరగా 2020ా21లో 8,548,898 మంది చేరారు. 2021ా22లో సభ్యుల సంఖ్య మళ్లీ పెరిగి 10,865,063కు చేరింది.
ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2020, 2021లో పలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాలపై ప్రభావం పడింది. 2023ా24కు ముందు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇపిఎఫ్‌ఓలో చేరిన నూతన సభ్యుల సంఖ్య కోవిడ్‌కు ముందున్న 2018ా19 స్థాయికి చేరుకోలేకపోయింది. 2018ా19లో ఇపిఎఫ్‌ఒలో 13,944,349 మంది కొత్త సభ్యులు చేరారు. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఇఎస్‌ఐసి)లో కూడా నూతన సభ్యుల చేరిక తగ్గింది. 2022ా23లో 17,760,672 మంది సభ్యులు చేరితే 2023ా24లో మంది 16,773,023 మాత్రమే చేరారు. జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పిఎస్‌)లో మాత్రం నూతన చందాదారుల సంఖ్య పెరిగింది.

➡️