ముంబయి : కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఈ నెల 26 తర్వాత ‘యువరాజు’ ఎక్కడికి వెళ్తారోనని ఆయన ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. తొలి దశలో ఎన్డిఎకు ఏకపక్షంగా ఓట్లు పడినట్టు తెలుస్తోందని ఆయన అన్నారు. ‘అమేథీలో ఓడిపోయిన కాంగ్రెస్ యువరాజు.. ఇప్పుడు వయనాడ్లోనూ ఓడిపోనున్నారు. ఈ నెల 26 (వయనాడ్ పోలింగ్ తేదీ) తర్వాత సురక్షిత స్థానం కోసం ఆయన వెతుక్కోవాల్సి ఉంటుంది’ అని మోడీ అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీపైనా మోడీ పరోక్ష విమర్శలు చేశారు. ‘ఇండియా’ ఫోరంలో కొందరు నేతలు లోక్సభను వదిలి, రాజ్యసభకు వెళ్లిపోతున్నారని సోనియాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.