పాట్నా : బీహార్లోని పాట్నా కోర్టు ఆవరణలో పోలీసుల ఎదుట కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అండర్ ట్రయల్లో ఉన్న ఖైదీపై ఇద్దరు వ్యక్తులు శుక్రవారం కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
బిజెపి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ సోదరుడి హత్య కేసులో సికేందర్పూర్కి చెందిన అభిషేక్ కుమార్ అలియాస్ చోటే సర్కార్ నిందితుడిగా ఉన్నాడు. నగరంలోని బవురా జైలులో ఉన్న అతనిని పాట్నాలోని దానాపూర్ కోర్టుకు తీసుకువెళుతుండగా ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పాట్నా వెస్ట్ ఎస్పి. రాజేష్ కుమార్ తెలిపారు. చోటే సర్కార్ అక్కడికక్కడే మరణించాడని అన్నారు.
కోర్టు ఆవరణ నుండి నాలుగు బుల్లెట్ల షెల్స్ను స్వాధీనం చేసుకున్నామని, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పారు. కాల్పులు జరిపింది ముజఫర్పూర్కు చెందినవారని, వారిని విచారిస్తున్నామని అన్నారు.