న్యూఢిల్లీ : నూతన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ఈ పిటీషన్ను విచారించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకూ ఉన్న క్రిమినల్ చట్టాల్లో లోపాలు, వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతూ గత ఏడాది డిసెంబర్ 21న భారతీయ న్యాయ (రెండో) సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష (రెండో) సంహిత, భారతీయ సాక్ష్య (రెండో) అనే మూడు బిల్లులను లోక్సభ ఆమోదించగా, డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్లో ఉన్న సమయంలో, ఎలాంటి చర్చలు లేకుండానే కొత్త చట్టాలను ఆమోదించారని, కాబట్టి వీటి అమలుపై స్టే విధించాలని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టాల సమర్థత పరిశీలనకు నిపుణుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. కొత్త చట్టాలు బ్రిటీష్ వలసవాద చట్టాల కంటే క్రూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.