ప్రజల జేబులు కొల్లగొడుతున్నారు
కేంద్రంపై రాహుల్ మండిపాటు
కార్బా (ఛత్తీస్గఢ్) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవని, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. భారత్ జోడో న్యారు యాత్రలో భాగంగా ఆయన సోమవారం ఛత్తీస్గఢ్లోని కార్బాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించి వారి జేబులు కొల్లగొడుతోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ కుటిల యత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు 74 శాతం మేర ఉన్నారని అంటూ భారత్లో అగ్రస్థానంలో ఉన్న 200 కంపెనీల్లో ఏ ఒక్కటీ వారి యాజమాన్యం కింద లేదని రాహుల్ గుర్తు చేశారు. కానీ దేశంలోని సొమ్మునంతటినీ ఆ కంపెనీలకే ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ‘నాకు చెప్పండి. గత నెలలో జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో మీరు పేదలు, కార్మికులు, నిరుద్యోగులు లేదా చిన్న చిన్న వ్యాపారులను చూశారా? నేను అదానీ, అంబానీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారారు, బడా వ్యాపారవేత్తలను మాత్రమే చూశాను. అదానీ, అంబానీ, వారి కుటుంబాలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఉపాధి లేక అధిక ధరలతో వేగలేక నానా ఇబ్బందులు పడుతుంటే.. అదానీ, అంబానీ వందల వేల కోట్ల ఆస్తులకు పడగలెత్తుతున్నారని రాహుల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో జోడో యాత్రను కుదించాలని రాహుల్ నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆయన పశ్చిమ ప్రాంతంలో పర్యటించడం లేదు. 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్లో ప్రవేశించి, 26వ తేదీ వరకూ కొనసాగాల్సి ఉంది. ఆ తర్వాత యాత్ర రాజస్థాన్లో ప్రవేశిస్తుంది. అయితే తాజా మార్పుతో ఐదు రోజుల ముందుగానే అంటే 21వ తేదీతో రాహుల్ యూపీలో తన యాత్రను ముగించుకొని మధ్యప్రదేశ్లో అడుగు పెడతారు.