- ఖండించిన ఎఐకెఎస్
న్యూఢిల్లీ : దళిత విద్యార్థి నాయకుడు, పిహెచ్డి స్కాలర్ రామదాస్పై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్ఎస్) రెండేళ్ల నిషేధం విధించింది. దళిత విద్యార్థుల సమస్యలపై తన గళాన్ని వినిపించే రామదాస్ ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యనిర్వాహక కమిటీలో సభ్యులు. ఎస్ఎఫ్ఐ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి. దేశవ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక అయిన ‘యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధి కూడా. అంతకు ముందు గతంలో ప్రొగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరం (పిఎస్ఎఫ్) ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టిఐఎస్ఎస్ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా సంస్థ యాజమాన్యం రెండేళ్ల పాటు రామదాస్పై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఎఐకెఎస్ తీవ్రంగా ఖండించింది. రామదాస్పై నిషేధాన్ని రాజ్యాంగం ప్రసాదించిన వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేసేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కుట్రలో భాగంగా ఎఐకెఎస్ విమర్శించింది.