వచ్చే ఏడాది బడ్జెట్లో కేటాయింపులు పెరిగేనా?
న్యూఢిల్లీ : కరోనా వంటి మహమ్మారి విజృంభించి లాక్డౌన్ సమయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించి బాసటగా నిలిచింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ ఆర్ఈజీఏ). విపత్కర సమయంలో అనేక రంగాలు ప్రభావితమవు తుండగా కొంతలో కొంత ప్రజలకు ఆర్థికంగా బలాన్ని అందించగలిగింది. ఇటు కేంద్రం ఈ పథకంలో పలు మార్పులను తీసుకొస్తున్నది. ఉపాధి కార్మికుల హాజరు, చెల్లింపులకు సంబంధించి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నది. ఇలాంటి తరుణంలో ఎంజీఎన్ఆర్ఈజీఏకు డిమాండ్ పెరగటంతో రాబోయే కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం ఉపాధి హామీ పథకం కింద గణనీయమైన మొత్తాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.బడ్జెట్ కేటాయింపులుబడ్జెట్ కేటాయింపులు 2019-20లో రూ. 71,002 కోట్ల వాస్తవ వ్యయంతో పోలిస్తే 2020-21లో రూ. 61,500 కోట్లకు పడిపోయాయి. అంటే 13 శాతం తగ్గుదల నమోదైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ పథకం కింద డిమాండ్ బాగా పెరిగింది. ఈ సంక్షోభ సమయంలో ఈ పథకానికి ఆత్మనిర్భర్ భారత్ ఉద్దీపన ప్యాకేజీ కింద దాని కేటాయింపును రూ.1.11 లక్షల కోట్లకు పెంచారు. 2022-23లో ఎంజీఎన్ఆర్ఈజీఏకు బడ్జెట్ కేటాయింపులు రూ. 89,400 కోట్లకు సవరించిన అంచనాల నుంచి 2023-24కి 33 శాతం తగ్గి రూ. 60,000 కోట్లకు పడిపోవటం గమనార్హం. అయితే, ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘ఉపాధి హామీ’కి డిమాండ్ పెరిగింది. రుతుపవనాల అనిశ్చితితో పాటు పట్టణ ఉద్యోగాల్లో సంక్షోభం కూడా ఉన్నది. ఎంజీఎన్ఆర్ఈజీఏ గ్రామీణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ.. మోడీ సర్కారుకు ఈ పథకంపై ఎప్పుడూ చిన్న చూపేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు గత కొన్నేండ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు, పథకంలో సంక్లిష్ట విధానాలు తీసుకురావటం వంటి వాటిని వారు ఉదహరిస్తున్నారు. ఒకవేళ కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు పెంచినా వచ్చే ఏడాది రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేస్తుందని తెలిపారు.